న్యూఢిల్లీ: ప్రపంచవ్యాపంగా ఆరోగ్యవంతమైన మానవుల ఆయుః ప్రమాణాన్ని కొవిడ్-19 మహమ్మారి తగ్గించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఆయుర్దాయాన్ని పెంచేందుకు పదేండ్లలో సాధించిన ప్రగతిని కేవలం రెండేండ్లలో ఈ మహమ్మారి తుడిచి పెట్టేసిందని చెప్పింది. 2019 నుంచి 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయుః ప్రమాణం 1.8 సంవత్సరాలు తగ్గి, 71.4 సంవత్సరాలకు చేరిందని, అంటే 2012 నాటి స్థాయికి తిరిగి వెళ్లినట్లని వివరించింది.
2021లో ప్రపంచంలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే వ్యక్తుల ఆయుర్దాయం 1.5 సంవత్సరాలు తగ్గి, 61.9 సంవత్సరాలకు చేరిందని, ఇది కూడా 2012 నాటి స్థాయేనని చెప్పింది. అమెరికా, ఆగ్నేయాసియా దేశాలపై కొవిడ్ ప్రభావం ఎక్కువగా పడినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. 2019-2021 మధ్య ఆయుర్దాయం దాదాపు మూడేళ్లు తగ్గిందని, ఆరోగ్యవంతమైన ఆయుష్షు 2.5 సంవత్సరాలు తగ్గిందని వివరించింది.