Artificial intelligence | న్యూఢిల్లీ, జూన్ 9: ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్నది. యంత్రాలే స్వయంగా ఓటర్లకు వ్యక్తిగతంగా పదేపదే సందేశాలు పంపటం ద్వారా వారి మనసు మార్చి తన క్లయింటుకు ఓటు వేసేలా భ్రాంతికి గురి చేస్తాయి. ఇక్కడ నిజాలతో పనిలేదు.. అభ్యర్థి శక్తి సామర్థ్యాలతో అవసరం లేదు.. పార్టీ విధానాల అక్కరలేదు.. చివరకు యంత్రం చెప్పినట్టే అభ్యర్థి నడుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి అల్గారిథమ్ మెషిన్లు ఇప్పటికే పనిలో పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని క్లాగర్, డాగర్.
ఏఐ మెషిన్ ప్రాథమిక స్థాయిలో మూడు దశల్లో ఓటర్లను ప్రభావితం చేస్తుంది.
మొదటి దశ: ఓటర్ల బ్రౌజింగ్ హిస్టరీని ఆధారంగా చేసుకొని వారి ఇష్టాలకు అనుగుణంగా ఏఐ లాంగ్వేజ్ మోడల్ మొదట లక్షల కొద్ది ప్రకటనలు సృష్టిస్తుంది. ఎవరో వ్యక్తి పంపినట్టుగానే మన పేరుతోనే ఆ యాడ్స్ మన ఫోన్లలో, కంప్యూటర్లలో నిత్యం ప్రత్యక్షమవుతుంటాయి.
రెండో దశ: మొదట పంపిన సందేశాలను బలపరుస్తూ మళ్లీ పుంఖానుపుంఖాలుగా సందేశాలు వస్తాయి. ఇలా మెల్లగా ఓటర్ అభిప్రాయాన్ని క్రమంగా మార్చుకొనేలా చేస్తుంది. సులభతరమైన వీడియో గేమ్స్తోపాటు పలు సర్వేలను కూడా మెషిన్ స్వయంగా సృష్టించి ఓటర్లతో మనుషులు చాట్చేసినట్టుగానే చేస్తూ నిర్వహిస్తుంది.
మూడో దశ: మొదటి రెండు దశల్లో ఒక ఓటర్ వ్యక్తపర్చిన అభిప్రాయాలను తన అభ్యర్థికి అనుకూలంగా మార్చి మరో ఓటర్కు మెషిన్ పంపుతుంది. దీంతో అవతలి ఓటర్ తన ఎన్నికల అభ్యర్థిపట్ల తన అభిప్రాయం తప్పో, ఒప్పో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోతాడు. అలాంటి స్థితిలో మెషిన్ తాను తన క్లయింట్కు అనుకూలంగా సృష్టించిన ప్రకటనలను వరుసగా పంపుతూనే ఉంటుంది. దీంతో ఓటర్ అదే నిజమని నమ్మి తన అభిప్రాయాన్ని మార్చుకొనే అవకాశాలే అధికంగా ఉంటాయి.
ఏఐ లాంగ్వేజ్ మోడల్ మొదట ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంలో భాగస్వాములు కావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నట్టుగా సందేశాలు పంపుతుంది. అలా ఓటర్ అభిరుచిని బట్టి అదే కోవలో ప్రకటనలు తయారుచేసి పంపుతూ పోతుంది. కొంతకాలం తర్వాత ఫలానా వ్యక్తి గొప్పవాడు అనేలా ప్రచారం మొదలవుతుంది.
ఏఐ లాంగ్వేజ్ మాడల్ ప్రచారంలో అభ్యర్థి, పార్టీ విధానాలతో పనే ఉండదు. ఏఐ మెషిన్ సృష్టించే మాయా ప్రపంచాన్ని సదరు అభ్యర్థి, పార్టీ కూడా అనుసరించాల్సిందే. అంటే అభ్యర్థి చరిత్ర, గుణగణాలు, పార్టీ విధానాలు, మ్యానిఫెస్టోలు నామమాత్రం అయిపోతాయి. ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడితే వచ్చే మార్పులపై గత నెల 16న అమెరికన్ పార్లమెంటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ను ప్రశ్నించగా, ఓటర్ల అభిప్రాయాలను కచ్చితంగా మార్చే అవకాశమున్నదని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూన్ 9: ఏ రంగంలోనైనా స్వీయ నియంత్రణ, సహకారం ముఖ్యమైన అంశాలని, ప్రపంచం మొత్తాన్ని కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టి వదిలేయమని చాట్జీపీటీ అప్లికేషన్ను అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సీఈవో ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. భారత్లో పర్యటిస్తున్న ఆల్ట్మన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా విధించాల్సిన నియంత్రణలపై మేం ఆలోచించాలనుకుంటున్నాం. దీని ద్వారా ఏఐకు సంబంధించిన కొన్ని లోటుపాట్లను నిరోధించవచ్చు’ అని తెలిపారు.