TB Injections | న్యూఢిల్లీ: టెస్టులు చేయకుండానే ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ) ఇంజెక్షన్ను మార్కెట్లో తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు ఇచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆధ్వర్యంలోని ల్యాబుల్లో సరైన సౌలత్లు లేకపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. టీబీ వ్యాధిని నివారించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీవై-టీబీ పేరిట ఓ ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతుల కోసం డీసీజీఐని సీరం సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ సంప్రదించారు.
గతేడాది మే 9న దీనికి డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. కానీ, ప్రభుత్వ ప్రయోగశాలల్లో సీరం రూపొందించిన ఇంజెక్షన్ను పరీక్షించేందుకు సరైన వసతులు లేకపోవడంతో దీనికి పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. దీంతో ఈ ఇంజెక్షన్కు పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి సీరం సంస్థ లేఖ రాసింది. దీంతో పాటు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖకు ఏప్రిల్ 24, మే 30న సీరం సంస్థ డైరెక్టర్ లేఖ రాశారు.
దీంతో ఈ ఇంజెక్షన్కు పరీక్షల నుంచి మినహాయింపులు ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ల్యాబుల్లో సౌలత్లు కల్పించకుండా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని మండిపడుతున్నారు. పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేయడమేంటని కేంద్రం తీరును ఎండగడుతున్నారు.