Supreme Court : పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి కొంతకాలం క్రితం వలస వచ్చిన దళిత హిందువులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు.
ముఖ్యంగా మజ్ను కా తిలా ప్రాంతంలోని, సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే, వీరి నివాసాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణల పేరుతో తొలగించేందుకు ప్రయత్నిస్తుండటంతో నిత్యం భయంతో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వం పౌరసత్వం కల్పించడంతోపాటు, ఇండ్లు మంజూరు చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా కీలక ఆదేశాలిచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆధ్వర్యంలోని బెంచ్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పాక్ నుంచి వచ్చిన హిందూ దళితులకు కేవలం భారత పౌరసత్వం ఇస్తే సరిపోదని, గౌరవంగా బతికేలా ఇండ్లు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే, ఇతర పునరావాస చర్యలకు కూడా కోర్టు ఆదేశించింది.
దీనికి సంబంధించి నాలుగు వారాల్లోగా సమాధానం తెలపాలని సూచించింది. అలాగే, ఆక్రమణల తొలగింపు లేదా అభివృద్ధి పనుల కోసం నివాసాల్ని తొలగిస్తే దళితులు ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది. వీరి నివాసాల తొలగింపును ఆపేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 250 కుటుంబాలు పాక్ నుంచి వచ్చి జీవిస్తున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు దళితులు ఉంటారని అంచనా. కొన్నేళ్లుగా ఉంటున్న వీరికి సరైన జీవన భద్రత లేకుండా పోయింది.