న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ముజఫర్నగర్ స్కూల్ టీచర్ ఓ ముస్లిం బాలుడ్ని తోటి పిల్లలతో చెంపదెబ్బలు కొట్టించిన ఘటన తీవ్రమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారిని నియమించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. ఆయన తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
నిందితులు, కేసుతో సంబంధమున్న పిల్లలందరికీ నిపుణులైన వారితో కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశాల్లో తెలిపింది. ఎలాంటి వివక్షకు తావివ్వకుండా, నాణ్యమైన, ఉచిత, నిర్బంధ విద్య అందించాలన్న విద్యాహక్కు చట్టాన్ని అమలుజేయటంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాహక్కు చట్టం అమలుపై నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.