Supreme Court : ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగార శిక్ష పడిన అమిత్ జోగికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమిత్ జోగిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అమిత్ జోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అయిన అమిత్ జోగి 2003లో జరిగిన ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా ఉన్నాడు. 2003 జూన్ 4న ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో అమిత్ జోగి తండ్రి అజిత్ జోగి సీఎంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ హత్యలో అమిత్ జోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో 2007లో ట్రయల్ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
అయితే ఈ తీర్పుపై హతుడి తరఫు వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసులో పునర్విచారణ జరిపింది. అమిత్ జోగిని దోషిగా నిర్ధారణ చేసి, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే అమిత్ జోగి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. తాత్కాలిక ఊరట లభించింది.