న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఆ తీర్పును పక్కన పెట్టి ఈ కేసును తాజాగా విచారణ జరపాలంటూ తిరిగి హైకోర్టుకు పంపింది.
తన శిక్ష నిలిపివేత కోరుతూ సెంగర్ చేసిన దరఖాస్తుపై వేసవి సెలవులకు ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో క్రిమినల్ అప్పీల్ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నది. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో 2017లో ఒక బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణపై కుల్దీప్ సింగ్పై కేసు నమోదైంది.