South Group | ఢిల్లీ, మే 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీబీఐ, ఈడీల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీవంటి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లలో ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని వాడి దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయంటూ హైదరాబాద్కు చెందిన పటోళ్ల కార్తీక్రెడ్డి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ దాఖలు చేసిన ఈ పిల్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇదే కేసులో ఉత్తరాది ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారని, వారిని ‘నార్త్ గ్రూప్’గా సీబీఐ ఎక్కడా సంబోధించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థలు ఒక ప్రాంతానికి చెందిన ప్రజల మనోభావాలను గౌరవించాలని అన్నారు. దక్షిణాదినుంచి వచ్చిన వారంతా నేరాలకు, కుంభకోణాలకు పాల్పడుతున్నారనే భావన కలిగించేలా దర్యాప్తు సంస్థల వ్యవహారశైలి ఉన్నదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. దేశంలో కేసులను దర్యాప్తు చేయాల్సిన ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థలు ఒక ప్రాంతాన్ని ఎత్తిచూపుతూ అధికారిక పత్రాల్లో ఎలా పేర్కొంటాయని ప్రశ్నించింది.
ఇది ఎంతమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదని, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. లేకుంటే తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎఫ్ఐఆర్లో ఉన్నట్టే తాము కూడా కోర్టు పత్రాల్లో అలాగే కొనసాగించామంటూ సీబీఐ న్యాయవాది ఇచ్చిన వివరణపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేరాభియోగాల వ్యవహారంలో దేశంలో ఒక ప్రాంతాన్ని ఎలా దోషిగా నిలుపుతారని నిలదీసింది. కేసు దర్యాప్తు పత్రాల్లోని ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని తక్షణమే తొలగించాలని సీబీఐ, ఈడీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
దేశంలోని ఒక ప్రాంతాన్ని కేసులతో ముడిపెట్టడం అనుచితమని పటోళ్ల కార్తీక్రెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణాదివారంతా నేరాలు చేస్తారనే భావన కలిగించేలా సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలు ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని ప్రస్తావించడం దారుణమని అన్నారు. చార్జిషీట్లో ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా అదే కేసులో నిందితులుగా ఉంటే వాళ్లను ‘నార్త్ గ్రూప్’ అని ఎందుకు సంబోధించలేదని నిలదీశారు. సౌత్నుంచి వచ్చినవాళ్లు నేరాలు, కుంభకోణాలు చేసేవాళ్లనే భావన కలిగించేలా దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.