న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థను రక్షించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు నొక్కిచెప్పింది. సరగసీ ద్వారా బిడ్డను కనేందుకు 44 ఏండ్ల అవివాహిత దాఖలుచేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ మంగళవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కామెంట్ చేసింది. విదేశాల్లోలాగా వివాహం కాకుండానే తల్లులు కావటం భారతీయ వివాహ వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
సరగసీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం వితంతువులు, లేదా విడాకులు తీసుకున్న 35 నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న మహిళలు మాత్రమే సరగసి పద్ధతి ద్వారా పిల్లల్ని పొందవచ్చు. అంతేకానీ.. పెళ్లి కాని ఒంటరి మహిళలు సరగసి ద్వారా తల్లి కావటానికి వీలు లేదు. భారతీయ సమాజంలో తల్లి కావాలంటే వివాహ వ్యవస్థ ద్వారానే కావాలి అనేది ఆచారం. వివాహంతో సంబంధం లేకుండా పిల్లలని కనటం అనాచారమని.. తాము దీని గురించే ఆందోళన చెందుతున్నామని ధర్మాసనం పేర్కొంది.
తాము పిల్లల సంక్షేమం దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని కూడా వివరించింది. ‘మన దేశంలో వివాహ వ్యవస్థను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉన్నది.. ఇలా తీర్పు చెప్తున్నందుకు మమ్మల్ని మీరు సంప్రదాయ వాదులని నిందించినా పర్వాలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ బహుళజాతి సంస్థలో పనిచేసే 44 ఏండ్ల అవివాహిత సరోగసి (నియంత్రణ) చట్టంలోని సెక్షన్ 2 చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
దీన్ని విచారించిన సుప్రీం ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. విదేశాల్లో చాలా మంది పిల్లలకు వారి తల్లిదండ్రులెవరో తెలీదని.. అలాంటి దుస్థితి మన పిల్లలకు రాకూడదని తాము అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ రోజుల్లో సైన్స్ అభివృద్ధి చెందింది. కానీ, సామాజిక నిబంధనలు కాదని సుప్రీం పేర్కొనటం గమనార్హం.