న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో భారీ లక్ష్యాలపై దృష్టి సారించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్ర నిర్మాణం, సుదీర్ఘ కాల మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగానికి ప్రయత్నించాలని భావిస్తున్నది.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘చంద్రయాన్ సక్సెస్ తర్వాత సాధ్యమయ్యే అన్ని విషయాలపైనా మేం దృష్టి సారించాం. అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై ఆలోచిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. గగన్యాన్ ప్రయోగం ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది.