న్యూఢిల్లీ, మే 27: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణం నెలకొన్నదని, రానున్న రెండు మూడ్రోజుల్లో కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం పేర్కొన్నది. తొలుత ఈ ఏడాది కాస్త ముందస్తుగానే మే 27నే రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి.
ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలపడ్డాయని, కేరళ తీరంతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత్తమై ఉన్నదని శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయని వాతావరణ విభాగం తాజాగా పేర్కొన్నది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది.