హైదరాబాద్, నవంబర్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఆర్భాటంగా ప్రకటించిన ‘శక్తి’ స్కీమ్కు నిధుల కటకట మొదలైంది. పథకం అమలు కోసం సిద్ధరామయ్య సర్కారు బడ్జెట్లో రూ. 2,800 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించింది. అయితే, అదివారం నాటికి ‘శక్తి’ స్కీమ్ కోసం ఉద్దేశించిన బడ్జెట్లో రూ.2,143 కోట్లు ఖర్చయినట్టు అధికారులు చెప్తున్నారు.
మిగతా నిధులు వచ్చే డిసెంబర్ వరకు మాత్రమే సరిపోతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గనుక వెంటనే నిధులు విడుదల చేయకపోతే, బస్సులు నడుపడమే కష్టమని తేల్చి చెప్తున్నారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి డిసెంబర్లో మరిన్ని నిధులను కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అయితే, కచ్చితంగా విడుదల చేస్తామంటూ హామీని మాత్రం ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన మిగతా నాలుగు గ్యారంటీలు కూడా అటకెక్కడం తెలిసిందే.
‘శక్తి’ స్కీమ్ తీసుకువచ్చిన తర్వాత బస్సులో మహిళల ప్రయాణాలు తగ్గుతాయని కాంగ్రెస్ సర్కారు తప్పుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి మహిళలు ఫ్రీ బస్సులను వినియోగిస్తుండటంతో డీజిల్ మోత మోగింది. దీంతో వ్యయ నివారణ చర్యలకు ప్రభుత్వం దిగింది. అనేక మార్గాల్లో బస్సు సర్వీసులను నడపడాన్ని నిలిపేసింది. గతంలో 5-10 నిమిషాలకు వచ్చే ఒక్కో బస్సు, ఇప్పుడు 40 నిమిషాలకు కూడా రావట్లేదని ‘ది హిందూ’ న్యూస్ పేపర్ ఇటీవల చేసిన సర్వేలో మహిళలు మండిపడ్డారు.
‘శక్తి’ స్కీమ్ మొదలయ్యాక, బస్సులో ప్రయాణం చేసే మహిళల సంఖ్య తగ్గుతుందని అనుకొన్నాం. అయితే, మా అంచనా తప్పింది. ప్రభుత్వం కేటాయింపులను వెంటనే పెంచాలి. లేకపోతే, ఫ్రీ బస్సు సర్వీసులను నడపడం కష్టం.
– కర్ణాటక ఆర్టీసీ అధికారి