దేశంలో మహిళల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ నేతలు ముందు వరుసలో ఉన్నారు. ఒక్కో ఎంపీ ఒక్కో రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలే చేసిన వ్యాఖ్యలకు ఆయన దూరం పాటిస్తున్నారు. ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధమే లేదని తేల్చి పారేశారు. ”ఆ వ్యాఖ్యలతో సమాజ్వాదీ పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ పూర్తి అభ్యుదయ భావాలతో నిండిన పార్టీ. మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టిన పార్టీ మాది” అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
షఫీకుర్ రెహ్మాన్ బర్క్, ఎంపీ
దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఎంపీ షఫీకుర్ రెహమాన్ బర్క్ తప్పుబట్టారు. భారత్ చాలా పేద దేశమని, ఈ దేశంలో ప్రతి తల్లీతండ్రీ తమ బిడ్డలకు తొందరగానే వివాహం చేయాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల వివాహ వయసు పెంపునకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాను మద్దతివ్వబోనని బర్క్ వ్యాఖ్యానించారు.
ఎస్టీ హసన్, పార్టీ ఎంపీ
బాలికలు తమకు యుక్త వయసు రాగానే పెండ్లి చేసుకోవాలని, పరిపక్వత వచ్చిన బాలిక 16 ఏండ్ల వయసులో వివాహం చేసుకున్నా తప్పేమీ కాదని ఎస్టీ హసన్ అభిప్రాయపడ్డారు. అయినా బాలికలు 18 ఏండ్ల వయసులో ఓటేయడానికి అర్హులు అయినప్పుడు.. పెండ్లి మాత్రమే ఎందుకు చేసుకోకూడదు..? అని ఆయన ప్రశ్నించారు.