గ్యాంగ్టక్, జూన్ 2: హిమాలయ రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఘన విజయం నమోదు చేసింది. 32 స్థానాలకు గానూ 31 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పవన్ కుమార్ చామ్లింగ్ రెండుచోట్ల ఓటమి చెం దారు. ఇక జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. ఐదేండ్ల తన పాలన ద్వారా ప్రజామోదం పొందిన ప్రస్తుత సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి అధికారం చేపట్టనున్నారు.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై సిక్కిం క్రాంతికారి మోర్చా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 2019 ఎన్నికల్లో 25 ఏండ్ల ఎస్డీఎఫ్ పాలనకు తెరదించి ఎస్కేఎం మొదటిసారి అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 58.38 శాతం ఓట్లను సాధించి ఏకంగా 31 సీట్లు గెలుచుకొని దాదాపుగా క్లీన్స్వీప్ చేసేసింది. ఇక, 2019 ఎన్నికల్లో 15 సీట్లు సాధించి స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ ఈసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఆ పార్టీ దాదాపు 20 శాతం ఓట్లను కోల్పోయి 27.37 శాతం ఓట్లతో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ష్యారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్డీఎఫ్ అభ్యర్థి టెంజింగ్ నోర్బు లమ్తా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
మరోసారి అధికారం చేపట్టనున్న 56 ఏండ్ల ప్రేమ్ సింగ్ తమాంగ్(పీఎస్ గోలే) సిక్కిం ప్రజల్లో మంచి ఆదరణను పొందారు. రాజకీయాల్లోకి రాకముందు మూడేండ్లు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన ప్రేమ్ సింగ్.. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 2009 వరకు ఆయన మంత్రిగా పని చేశారు. ఎస్డీఎఫ్లో ఆయన చామ్లింగ్కు శిష్యుడిగా కొనసాగారు. 2009 తర్వాత ఆయనకు పవన్ కుమార్ చామ్లింగ్తో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎస్డీఎఫ్ నుంచి బయటకు వచ్చి 2013లో సొంతంగా సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల నాటికి 17 సీట్లు సాధించి 25 ఏండ్ల ఎస్డీఎఫ్ పాలనకు ముగింపు పలికి రికార్డు సృష్టించారు భైచంగ్ భూటియాకు తప్పని ఓటమి భారత ఫుట్బాల్ దిగ్గజం భైచంగ్ భూటియాకు ఈ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. బర్ఫంగ్ నుంచి ఆయన సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ తరపున పోటీ చేసి ఓడారు.
బీజేపీ, కాంగ్రెస్ కుదేలు
సిక్కింలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేసి అన్నింటా ఓడిపోయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా కలిపి కేవలం 19,956 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్ మరింత దారుణంగా ఓడింది. ఆ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయగా అన్నింటా కలిపి కేవలం 1,228 ఓట్ల, అంటే 0.32 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. నోటాకు వచ్చిన 0.99 శాతం ఓట్ల కంటే కాంగ్రెస్కు తక్కువ వచ్చాయి. స్థానిక సిటిజన్ యాక్షన్ పార్టీ-సిక్కిం సైతం 30 స్థానాల్లో పోటీ చేసినా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది.
ఈ ఎన్నికల్లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్కు ఘోర పరాభవం ఎదురైంది. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చామ్లింగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. పాక్లోక్ కామ్రాంగ్ నియోజకవర్గంలో చామ్లింగ్పై ఎస్కేఎం అభ్యర్థి భోజ్రాజ్ రాయ్ 3,063 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నామ్చేబంగ్లో ఎస్కేఎం అభ్యర్థి రాజుబసంత్ చేతిలో 2,256 ఓట్ల తేడాతో చామ్లింగ్ ఓటమి చవిచూశారు. ఆయన గతంలో తన నాయకత్వంలో ఎస్డీఎఫ్ను ఐదుసార్లు అధికారపీఠంపై కూర్చోబెట్టారు.
సిక్కిం క్రాంతికారి మోర్చా-17
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్-15
బీజేపీ-0,కాంగ్రెస్-0