Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తీసుకొస్తానన్న నల్లధనం తేలేదు. దొంగనోట్ల ముద్రణను కట్టడి చేస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికడతామన్న మాటను నిలబెట్టుకోలేదు. వెరసి.. ప్రధాని మోదీ 2016లో తీసుకున్న ‘పెద్ద నోట్లరద్దు’ నిర్ణయం ఓ అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. గత మార్చిలో కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో రూ. 13 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉండగా.. 2022 మార్చి నాటికి ఈ మొత్తం రూ. 31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ .. 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగింది. ఈ వివరాల్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. అయితే, ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేరలేదని తెలిసినప్పటికీ, రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ మోదీ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది.
పెద్ద నోట్లను రద్దు చేసి ఆరున్నరేండ్లు గడిచిపోయింది. టీ కొట్టు నుంచి ఆభరణాల షోరూమ్ వరకూ, గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకూ దాదాపుగా అంతటా డిజిటల్ లావాదేవీలదే రాజ్యం. ఆన్లైన్, ఈ-కామర్స్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటప్పుడు విపణిలో నోట్ల వాడకం తగ్గాలి. కానీ నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకూ నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. 2016లో రూ. 16.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా, 2022 డిసెంబర్ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు చేరింది. అంటే, దాదాపుగా రెట్టింపైంది. మరోవైపు నకిలీ నోట్ల కట్టడికే పెద్దనోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చినట్టు అప్పుడు కేంద్రం చెప్పుకొచ్చింది. ఈ ఆరున్నరేండ్లలో నకిలీనోట్లు పెద్దయెత్తున పట్టుబడ్డాయా? అంటే.. అదీలేదు. కేవలం రూ. 250 కోట్ల నకిలీ నోట్లను మాత్రమే పట్టుకొన్నట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఉగ్రవాద మూలాలను కూకటివేళ్లతో పెకిలించడానికి, వారికి ఆర్థిక సాయం అందకుండా ఉండటానికే పెద్ద నోట్లను రద్దు చేపట్టామని కేంద్రం చెప్పినప్పటికీ, అదీ జరుగలేదని తేలిపోయింది.