అహ్మదాబాద్, జనవరి 1: బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పత్తి రైతుల కష్టానికి ఫలితం ఉండట్లేదు. రాష్ట్రంలో పత్తి ధర భారీగా పడిపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టాలను మిగులుస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి ఫలితం రాకపోగా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదంటున్నారు. ఇంతకుముందు 20 కిలోల పత్తికి దాదాపుగా రూ.2,500 పలికిన ధర.. ఇప్పుడు రూ.1600కు పడిపోయింది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సబర్కంఠా జిల్లాకు చెందిన రాజు పటేల్ అనే పత్తి రైతు తాను పండించిన పత్తిని తగులపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు.
మద్దతు ధర సరిపోదు
కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. 20 కేజీలకు రూ.1,276 మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. ఈ ధరతో రైతుకు 20 కేజీల మీద రూ.600 లాభం వస్తుందని అంచనా వేసింది. కానీ, ఈ లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. 20 కేజీలకు కనీసం రూ.2,100 వస్తేనే పెట్టుబడి పోను కొంతైనా లాభం ఉంటుందని రైతులు చెబుతున్నారు.