హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ వినియోగం మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేసే దుస్థితి దాపురించింది. అత్యంత సూక్ష్మరూపంలో గాలిలో చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు (మైక్రో, నానో ప్లాస్టిక్) గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. తాజాగా తల్లిపాలలోనే కాదు పురుషుడి శుక్రకణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను గుర్తించినట్టు అమెరికా, ఆస్ట్రియా పరిశోధకులు తెలిపారు. 30 మంది పురుషుల నుంచి సేకరించిన శుక్రకణాలను విశ్లేషించగా.. 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ను గుర్తించినట్టు పేర్కొన్నారు.
సంతానోత్పత్తిపై ప్రభావం
రక్తం, గుండెలో చేరే మైక్రోప్లాస్టిక్తో క్యాన్సర్, గుండెజబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదమున్నదన్న శాస్త్రవేత్తలు.. తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్లాస్టిక్ దుష్ప్రభావం చూపుతున్నట్టు గమనించినట్టు వెల్లడించారు. కాగా లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగుచూడటం తెలిసిందే.