న్యూఢిల్లీ, ఆగస్టు 23: నాటి షోలే నుంచి నేటి ధురంధర్ వరకు.. బాహుబలి నుంచి పుష్ప వరకు మూడు అంతకన్నా ఎక్కువ గంటల నిడివి ఉన్న సినిమాలను ఓపికగా చూడటానికి దశాబ్దాలుగా భారతీయ ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఇక అనేక సీజన్ల పాటు సాగే ఓటీటీ వెబ్ సిరీస్లకు అంతే లేదు. అయితే ప్రస్తుత జెన్ జీ ఆ పరిస్థితిని మార్చేసింది. ఇప్పుడు మన దేశంలో మైక్రో డ్రామా బూమ్కు వస్తున్న ఆదరణ దాని పెరుగుదల ప్రాథమిక దశను చూస్తున్నది. యువ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లా వీటికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఏర్పడనున్నది. కథలు చిన్నగా, ఒక విధంగా సూక్ష్మంగా కేవలం ఒకటి రెండు నిమిషాల నిడివితో ఉన్న ఎపిసోడ్లను మైక్రో డ్రామాలుగా పేర్కొంటున్నారు.
నించుని ఉన్నా, కూర్చుని ఉన్నా, మాట్లాడుతున్నా, ఆఖరికి ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు కూడా వీటిని చూస్తూ ఉండటం ప్రజలకు అలవాటుగా మారిపోతున్నది. ఇది మరొక భిన్న వీడియో ట్రెండ్ మాత్రమే కాదు. ప్రజలు కల్పిత కథనాలను స్వీకరించే విధానంలో ఇది ఒక మార్పును సూచిస్తున్నదని స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్లు 1-2 నిముషాలు (ఒక్కోసారి అంతకన్నా తక్కువగా) ఉంటాయని, గంటల తరబడి సాగే డ్రామాలకు ఇది తెర వేయవచ్చునని పేర్కొన్నారు.
మైక్రో డ్రామాల నిడివి ఇంత తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నా ప్రాథమికంగా కథ చెప్పే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. మామూలు కథల్లాగా అందులో కూడా ఒక హీరో, హీరోయిన్, విలన్, కుటుంబ బాంధవ్యాలు, సంఘర్షణ, హాస్యం ఉంటాయి. దీని ఫలితంగా ఒకే సమయంలో కొత్తగా, వింతగా సుపరిచితంగా అనిపించే ఒక వినోద రూపం ఆవిష్కృతమవుతుంది. దీని మార్కెట్ ఆ దేశంలో సుమారు 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భారత్లో ఈ ఇండస్ట్రీ అభివృద్ధి మెల్లిమెల్లిగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తున్నది. కోట్లాది మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న క్రమంలో మైక్రో డ్రామా మార్కెట్ భారత్లో అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పేర్కొంటున్నారు. రెండున్నర గంటల సినిమా చూడాలంటే పూర్తి సమయం దానికి వెచ్చించాల్సిందే. కాబట్టి మెరుపులా వచ్చి నిమిషంలో ముగిసే మైక్రో డ్రామాలకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఏర్పడేలా ఉంది.