న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వేతనాలు, ఉద్యోగ నిబంధనల్లో ఎయిరిండియా యాజమాన్యం చేసిన సవరణలపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని పైలట్లకు చెందిన రెండు యూనియన్లు తాజాగా ప్రకటించాయి. రోజులో 24 గంటలు, వారమంతా పైలట్లు అందుబాటులో ఉండేలా, వేతనాల్లో, సిక్ లీవులకు కోతలు విధిస్తూ ఎయిరిండియా ప్రకటించిన తాజా పాలసీపై పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత మొదటిసారిగా సంస్థలో సంక్షోభానికి దారితీసే అవకాశాలున్నాయి.
సవరించిన వేతన నిబంధనలు అమలుజేయరాదంటూ ద ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ద ఇండియన్ పైలట్స్ గిల్డ్ సంస్థ యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి. ఉద్యోగ సంఘాల్ని చీల్చే ప్రయత్నం జరుగుతున్నదని ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్కు లేఖ రాశాయి. ఇదంతా కూడా కార్మిక నిబంధనలకు విరుద్ధమమని పేర్కొన్నాయి. తాము లేవనెత్తిన అంశాలపై స్పందించకపోతే పైలట్లంతా సమ్మెకు వెళ్తారని హెచ్చరించాయి.