వారణాసి, జూన్ 4: జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్ వెల్లడించారు. పిటిషనర్లలో ఒకరైన విశ్వ వేదిక సనాతన సంఘం అధ్యక్షుడు జితేంద్రసింగ్ విసెన్ ఈ మేరకు ఆదివారం తెలిపారు. తన భార్య కిరణ్ సింగ్, మేనకోడలు రాఖీసింగ్ కూడా తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
హిందువులతో పాటు వివిధ వర్గాల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మం కోసం తాను పోరాటం చేయలేనని చెప్పారు. జితేంద్రసింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ కోర్టుల్లో జ్ఞానవాపి అంశంపై పిటిషన్లు వేశారు. శృంగారగౌరీ మాతను పూజించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాఖీసింగ్ పిటిషన్ వేశారు.