ముంబై, మే 21 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని కందార్ తాలూకా బహదూర్పురా గ్రామానికి చెందిన ‘పేఠ్కర్’ కుటుంబం’ తమ ఇంట జరిగే పెండ్లి వేడుకను వినూత్నంగా జరుపుకొన్నారు. వివాహ కానుకగా.. తమ గ్రామంలోని 3,500మందికి ప్రమాద బీమా చేయించింది. బీమా మొత్తాన్ని వరుడు సిద్ధేశ్వర్, వధువు మంజూషలు చెల్లించటం వార్తల్లో నిలిచింది. భవిష్యత్తులో ఏదైనా దురదృష్టకర ఘటన జరిగినప్పుడు గ్రామస్తులకు ఆర్థిక భరోసా కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశం.
‘వ్యవసాయం చేస్తుండగా పాముకాటుకు గురవడం, అడవి జంతువుల దాడికి గురికావడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనలను చూసి మా అన్న వీళ్లకు ఏదైనా చేయాలని భావించాడు. ‘పేఠ్కర్’ కుటుంబం తరపున మేం గ్రామం మొత్తానికి బీమా చేయించాం’ అని పెండ్లికొడుకు అన్నారు. ఈ బీమా ద్వారా ప్రతి ఒకరికీ సుమారు రూ. ఒక లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందని వరుడి సోదరుడు అనూప్ పేఠర్ తెలిపారు. గత సంవత్సరం తన పెండ్లి సమయంలో హెల్మెట్ శిబిరాన్ని నిర్వహించినట్టు చెప్పాడు.