శ్రీనగర్, ఆగస్టు 18: షోపియాన్ జిల్లాలోని చోటిగామ్ అనే గ్రామం అది. ఆ పల్లెలో మొత్తం 19 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 17 కుటుంబాలు ముస్లింలవి కాగా, మిగతా రెండు పండిట్లవి. అందులో పండిట్ సునీల్ కుమార్ భట్ కుటుంబం కూడా ఉన్నది. ఉగ్రవాదుల చేతుల్లో మంగళవారం సునీల్ దారుణ హత్యకు గురయ్యారు. దీంతో గ్రామంలో మిగిలిన ఏకైక పండిట్ జానకినాథ్ కుటుంబం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నది.
ఏ క్షణంలో ఎవరు విరుచుకుపడతారోనని భయంభయంగా బతుకీడుస్తున్నది. ‘సునీల్పై దాడి జరిగాక.. మేము మరింత భయపడిపోయాం. మాకు భద్రత కల్పించాలని డివిజనల్ కమిషనర్ను కోరాం. అయితే ఆయన మా విజ్ఞప్తిని పట్టించుకోవట్లేదు. తమ చేతుల్లో ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు’ అని జానకినాథ్ సోదరుడు అనిల్ భట్ తెలిపారు. అయితే, ‘మేం ఇక్కడే చావాల్సిందేనా?’ అని కమిషనర్ ముందు గట్టిగా ఏడ్చేశానని వాపోయారు. తమ భద్రతను మోదీ సర్కారు గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.