న్యూఢిల్లీ/ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు పదేపదే వల్లించే మాట ‘డబుల్ ఇంజిన్’. అయితే ఆ డబుల్ ఇంజిన్ అనేది ట్రబుల్ ఇంజినే అని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది. బీజేపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేవనే విషయం ‘బడి బయట పిల్లల(ఓఓఎస్సీ)’ విషయంలో తాజాగా స్పష్టమైంది. ప్రాథమిక విద్య స్థాయి(6-14 ఏండ్లు)లో పాఠశాలలో నమోదు కాని పిల్లలు లేదా ఏదొక దశలో బడికి వెళ్లడం మానేసిన పిల్లల సంఖ్య బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అధికంగా ఉన్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి ఇటీవల సర్వే డాటాను లోక్సభలో వెల్లడించారు. 2022-23లో దేశవ్యాప్తంగా 9,30,531 మంది పిల్లలు బడి బయట ఉన్నారు. వీరిలో బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా 3,96,655గా ఉన్నారు. ఇక దశాబ్దాలుగా ఆ పార్టీ పాలిస్తున్న గుజరాత్లో 1,34,252 మంది ఇంకా బడిబయటే ఉన్నారంటే.. బీజేపీ పాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తమంగా తెలంగాణ
బడి బయట పిల్లల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం బీజేపీ పాలిత, ఇతర రాష్ర్టాల కంటే చాలా మెరుగ్గా, ఉత్తమంగా ఉన్నది. తెలంగాణలో ఈ సంఖ్య కేవలం 4,556గా ఉన్నది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొన్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ‘మన ఊరు-మన బడి’ అనే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచడంలో దోహదం చేసింది. తెలంగాణలో బడి బయట పిల్లల సంఖ్య తక్కువగా ఉండేందుకు బడి బాట(విద్యార్థుల నమోదు), ‘మన ఊరు-మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలే కారణమని విద్యాశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించడం జరిగిందని, అదేవిధంగా బడి మానేసిన పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకొన్నామని చెప్పారు.
మోదీ నియోజకవర్గంలో అధ్వాన్న పరిస్థితులు
ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో 5,788 మంది విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు. ఈ సంఖ్య మొత్తంగా తెలంగాణ(4,556) కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గంపై ఎంత మేరకు దృష్టి పెడుతున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.