న్యూఢిల్లీ: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య నిరుడు సుమారు 75 శాతం తగ్గింది. వీసా స్క్రూటినీ కఠినతరం కావడం, పరిమిత ఇంటర్య్యూ స్లాట్లు, ఉద్యోగ అవకాశాల్లో అనిశ్చితి వల్ల చాలా మంది యువత తమ విద్యాభ్యాసాన్ని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు-అక్టోబర్ మధ్యలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎక్కువ మంది భారత విద్యార్థులు దరఖాస్తు చేస్తారని.. కానీ ఈ సారి ఆ సంఖ్య బాగా పడిపోయిందని విద్యా సలహాదారులు చెప్తున్నారు. వీసా స్క్రూటినీ కఠినతరం కావడం వల్ల భారత విద్యార్థులు కేవలం యూఎస్లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. శతాబ్ద కాలంలో యూఎస్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికాలో చదివే ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం కూడా మన విద్యార్థులపైనా ప్రభావం చూపింది.