న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఎన్డీయే 2.0 ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక విధానాలు పెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ ఆగస్టు ఎడిషన్ సర్వేలో వెల్లడైంది. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోనే నడుపుతున్నదని విశ్వసించే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. 2021 జనవరిలో నిర్వహించిన సర్వేలో.. మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ బాగున్నదని 67శాతం మంది పేర్కొనగా, తాజాగా ఇది 48 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదని 29శాతం మంది (2021 జనవరిలో ఇది 10శాతమే) పేర్కొన్నారు. మరో 20 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండగా.. మోదీ సర్కారు తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటం గమనార్హం.
2024 ఎన్నికలే లక్ష్యంగా.. ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసే ప్రసంగం 2024 లోక్సభ ఎన్నికలకు రోడ్మ్యాప్లో భాగమేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మూడు ముఖ్యాంశాలే ఎజెండాగా ఆయన ప్రసంగం సాగనున్నట్టు సమాచారం. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు, చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా సమస్యలపైనే ప్రసంగంలో ఆయన ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలను స్పృషిస్తూ ఆద్యంతం ఎమోషనల్గా మోదీ స్పీచ్ సాగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎర్రకోటపై మోదీ ప్రసంగం సుమారు 65 నిమిషాల పాటు కొనసాగనున్నదని, దీనిపై శుక్రవారం ప్రధాని రిహార్సల్ కూడా చేశారని సమాచారం. 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఎర్రకోటపై ఒకసారి, నవంబర్లో కొత్త పార్లమెంట్ భవనంలో మరోసారి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఇంకోసారి మోదీ ప్రసంగించనున్నారని తెలుస్తున్నది.