న్యూఢిల్లీ: ఈ నెల 8న అపస్మారక స్థితిలో చెత్తకుండీలో దొరికిన పసికందుకు ప్రాణాపాయం తప్పింది. పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో ఢిల్లీ శిశు సంక్షేమ మండలి ప్రతినిధులకు ఆమెను అప్పగించారు.
ఢిల్లీలోని వసంత్కుంజ్ ఏరియాలోగల ఓ చెత్తకుండీలో రెండు రోజుల పసికందు ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి కాలుకు కుక్క కరిచిన గాట్లు ఉండటం, ఒళ్లంతా చల్లబడిపోయి ఉండటం, పుట్టు కామెర్లవల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, బరువు తక్కువగా ఉండటం చూసి పోలీసులు ఆ చిన్నారిని స్థానికంగా ఉండే ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు.
చిన్నారిని అడ్మిట్ చేసుకున్న వైద్యులు 11 రోజులుగా చికిత్స అందించారు. అడ్మిట్ అయినప్పుడు 2.1 కిలోలు ఉన్న బరువు ఇప్పుడు 2.5 కిలోలకు చేరింది. కామెర్లు తగ్గిపోయాయి. శ్వాస సాధారణ స్థాయికి చేరుకుంది. గాయం మానుతుంది. దాంతో వైద్యులు ఆ చిన్నారిని డిశ్చార్జి చేశారు. ఢిల్లీ శిశు సంక్షేమ మండలి ప్రతినిధులు ఆ చిన్నారిని తీసుకెళ్లారు.