జైపూర్ : దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్లో పారా మెడికల్ పేపర్లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఓ ఎగ్జామ్ సెంటర్లో 45 మంది స్టూడెంట్లను రూ.5.5లక్షలకు పాస్ చేయించేందుకు సదరు ముఠా ప్లాన్ చేసినట్టు తేలింది. దీంతో కాలేజీ అధికారులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో వాట్సాప్ చాట్స్, డైరీలు, అడ్మిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎవరెవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ప్రభాదేవి మెమోరియల్ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా అనేక తప్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్లకు సరైన సమయానికి ప్రశ్న పత్రాలు ఇచ్చారు. కానీ నాలుగో ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్లు పేపర్ కోసం గంటకుపైగా వేచి చూశారు. అలాగే కొందరు స్టూడెంట్లను ఎగ్జామ్ హాల్లో కాకుండా బయట టెంట్ల కింద కూర్చోబెట్టి రాయించారు. దీంతో పోలీసులు సదరు ఎగ్జామ్ సెంటర్లోనూ విచారణ జరపనున్నారు. జూన్ 29న కొందరు స్టూడెంట్ల నుంచి పేపర్లీక్ ముఠా ఎగ్జామ్లో పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం జైపూర్ పోలీసులు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు.