న్యూఢిల్లీ: పీజీ డిప్లొమా వైద్య కోర్సుల ప్రవేశాలకు 2026-27 విద్యా సంవత్సరం చివరిదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) సోమవారం ఒక పబ్లిక్ నోటీస్లో పేర్కొన్నది. ఈ కోర్సులను నిర్వహిస్తున్న కళాశాలలు వాటిని ఎండీ, ఎంఎస్ డిగ్రీ సీట్లుగా మార్చాలని ఆదేశించింది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కోర్సులను ఆ తర్వాత నిలిపివేస్తామని తెలిపింది.
చాలా కళాశాలలు ఒకే స్పెషాలిటీలో డిప్లొమా, డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయని.. ఇందులో చాలా కళాశాలలు డిప్లొమా సీట్లను ఎండీ లేదా ఎంఎస్ డిగ్రీ సీట్లుగా మార్చుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నాయని తాము నమ్ముతున్నట్టు తెలిపింది.
డిప్లొమా సీట్లను డిగ్రీ సీట్లుగా మార్చుకోవాలనుకొంటున్న కళాశాలలు వైద్య మదింపు, రేటింగ్ బోర్డ్కు ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను ప్రామాణీకరించాలనే లక్ష్యంతో, ప్రత్యేక శిక్షణ గుర్తింపును మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని కమిషన్ తెలిపింది.