న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఈపీఎఫ్ఓలో భాగమైన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) -1995 ఖాతాదారులకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే కనీస పింఛను మొత్తాన్ని పెంచాలని ఈపీఎస్ -95 జాతీయ ఉద్యమ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది. ప్రస్తుతం ఇస్తున్న కనీస నెలవారీ పింఛను రూ.1000ను రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛన్ కనీసం ఔషధాలు కొనేందుకు కూడా సరిపోవడం లేదని ఈ కమిటీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ఈ కమిటీ లేఖ రాసింది. 15 రోజుల్లో తమ డిమాండ్ను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా రైళ్లు, రోడ్లను స్తంభింపజేస్తామని, దీక్షకు దిగుతామని హెచ్చరించింది.