బెంగళూరు: ఓటర్ ఐడీల ట్యాంపరింగ్ కేసులో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రధాన నిందితుడని కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్పై ప్రజలు విశ్వాసం నిలబెట్టుకునేలా దర్యాప్తు కొనసాగాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బెంగళూరులోని 28 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్ స్క్రూటినైజ్ జరగాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో ఓటర్ ఐడీల ట్యాంపరింగ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, దానిపై వాళ్లు జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించవచ్చని సవాల్ విసిరారు.
తన హయాంలో ఇలాంటి ఫిర్యాదులు ఏవీ రాలేదని సిద్ధరామయ్య చెప్పారు. తమ ఫిర్యాదును ఈసీ సీరియస్గా తీసుకుంది కాబట్టే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు సహా శివాజీనగర్, మహదేవ్ పురా, చిక్పేట్ నియోజకవర్గాలకు చెందిన ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. బొమ్మై ప్రభుత్వం మాల్ ప్రాక్టీస్కు పాల్పడిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.