Manipur Encounter | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల మణిపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో 40 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు అక్కడి సీఎం బీరేన్ సింగ్ ప్రకటన వాస్తవ విరుద్ధమని ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ పత్రిక తన పరిశోధనాత్మక కథనంలో ప్రకటించింది. ఎన్కౌంటర్లో చనిపోయింది ఉగ్రవాదులు కాదని, సామాన్య పౌరులని, మృతులకు ఆందోళనకారులతోనూ, ఆందోళనతోనూ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
మైతీ, కుకీ జాతులకు చెందిన వారితోనూ, మృతుల కుటుంబ సభ్యులతోనూ తమ బృందం మాట్లాడినట్లు పేర్కొంది. తమ పరిశోధన ప్రకారం మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ చేసిన ప్రకటన వాస్తవ విరుద్ధమని తేలినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు మణిపూర్ అల్లర్లలో 98 మంది మరణించగా, 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 37 వేల మందికి పైగా రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు. హింస చెలరేగి నెల రోజులు దాటినా అక్కడ ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. మృతులను ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు.. ఎన్కౌంటర్లలో చనిపోయిన వారి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేక పోతున్నారని, మృతులను గుర్తించలేక పోతున్నప్పుడు, వారు ఉగ్రవాదులను ఎలా చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే ఐటీఎల్ఎఫ్ మాత్రం అల్లర్ల మృతుల్లో 80 మంది గిరిజనులని ప్రకటించిందని, వారిలో 50 మందిని గుర్తించలేదని కథనం పేర్కొంది.
సీఎం బీరేన్ సింగ్ ఎన్కౌంటర్లలో 40 మంది మిలిటెంట్లు మరణించారని ప్రకటిస్తే డిఫెన్స్ చీఫ్ సీడీఎస్ అనిల్ చౌహాన్ మాత్రం మణిపూర్లో జరిగిన హింసకు ఉగ్రవాదులకు సంబంధంలేదని, రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లని ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూన్ 9: మణిపూర్లో మారణకాండ కొనసాగుతున్నది. శుక్రవారం మరో ముగ్గురు హత్యకు గురికాగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కుకీలు మెజార్టీగా ఉండే ఖొకెన్ అనే గ్రామంలోకి మిలటరీ రంగు దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారని ఐటీఎల్ఎఫ్ నేత ఒకరు పేర్కొన్నారు. ఘటనాస్థలిలోనే ఇద్దరు గ్రామస్తులు మరణించారని, తీవ్ర గాయాలతో మరో వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. దుండుగులు భద్రతా సిబ్బంది మాదిరిగా గ్రామస్తులను ఏమార్చారని, ఒక్కసారిగా వారు తుపాకులతో కాల్పులు జరిపారని ఐటీఎల్ఎఫ్ నేత చెప్పారు. మరోవైపు మణిపూర్లో చోటుచేసుకొన్న హింసాకాండకు సంబంధించిన ఆరు కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ప్రత్యేక బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి డీఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారని అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల నిషేధంపై దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.