Madhya Pradesh | భోపాల్, మే 14: తరతరాలుగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్న మధ్యప్రదేశ్లోని అన్యంపుణ్యం తెలియని ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు మరణ శయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవి బిడ్డలను.. ఆ అడవి నుంచే తరిమేస్తుండటంతో ఎక్కిడికి వెళ్లాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఆర్తనాదాలు చేస్తున్నారు. దశాబ్దాలుగా తాము సాగుచేసుకొంటున్న భూములపై తమకు హక్కులు కల్పించాలని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకొన్నా, ఎంతమంది అధికారులు, నేతలకు మొర పెట్టుకొన్నా ‘తిరస్కరణ’కే గురవుతున్నారు.
దేశంలోని అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కోటిన్నరమంది గిరిజనులున్నారు. వీరు ఎంతోకాలంగా సాగుచేసుకొంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు 2006లో ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ) యాక్ట్ను అమల్లోకి తెచ్చింది. దీనినే సంక్షిప్తంగా ఎఫ్ఆర్ఏ చట్టం అని పిలుస్తున్నారు. ఈ చట్టం ప్రకారం 2005, డిసెంబర్ 13వ తేదీకంటే ముందునుంచి భూమిని సాగుచేసుకొంటున్నట్టు గిరిజనులు ఆధారాలు చూపిస్తే, ఆ భూమిలో పది ఎకరాలకు మించకుండా సదరు సాగుదారుడికి ప్రభుత్వం భూ పట్టా జారీచేయాలి. ప్రతి గ్రామంలో గ్రామ సభ సమావేశమై భూమిపై హక్కుదారులను గుర్తించాలి. ఆ గుర్తింపు పత్రంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంటే పట్టా లభిస్తుంది.
అయితే, ఈ చట్టంతో అడవులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని వైల్డ్లైఫ్ ఫస్ట్, ది వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, నేచర్ కన్జర్వేషన్ సొసైటీ, టైగర్ రిసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ట్రస్ట్ తదితర సంస్థలు 2008లో సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఎఫ్ఆర్ఏ చట్టం రాజ్యాంగబద్ధతను ఆ సంస్థలు సవాల్ చేయటంతో కోర్టు 2019 ఫిబ్రవరి 13న ఎఫ్ఆర్ఏ చట్టం కింద తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులందరినీ ఆయా భూముల నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఏకంగా కోటిమంది గిరిజనులు నిలువ నీడ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడటంతో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దీనిని విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. తిరస్కరణకు గురైన పట్టా దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించాలని 20 రాష్ర్టాలను ఆదేశించింది. ఇప్పటివరకు ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులందరికి కలిపి కోర్టు ఏకంగా 240 నోటీసులు జారీచేసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల భూ పట్టాల దరఖాస్తులను పరిశీలించేందుకు ‘వాన్ మిత్ర’ పోర్టల్ను, మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో అంతకుముందే నేరుగా దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురైన గిరిజనులు నానా కష్టాలూ పడి వాన్మిత్రలోనూ, మొబైల్ యాప్స్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకొన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఇక్కడే తన అసలు బుద్ధిని బయటపెట్టుకొన్నది. ముందూ వెనుకా చూడకుండా వచ్చిన దరఖాస్తును వచ్చినట్టు తిరస్కరిస్తూ పోతున్నదని గిరిజన హక్కుల నేతలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 2008-2019 మధ్య వచ్చిన 5,79,411 దరఖాస్తుల్లో ఏకంగా 3,54,787 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో ఇవి 61.2 శాతం. ఇక వాన్మిత్ర అమల్లోకి వచ్చిన తర్వాత.. గత ఏడాది నవంబర్ నాటికి అందులో కూడా 6, 27,513 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 5,85,326 దరఖాస్తులు వ్యక్తులవి, 42,187 దరఖాస్తులు సమూహాలవి ఉన్నాయి. వీటిలో 2,94,585 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో తిరస్కరణకు గురైన గిరిజన బిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటవీ అధికారులు ఎప్పుడొచ్చి తమను ఖాళీ చేయాలని ఆదేశిస్తారోనని నిత్యం భయంతో బతుకుతున్నారు.
భూ హక్కుల దరఖాస్తుల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన వాన్మిత్ర పోర్టల్ను కూడా ప్రభుత్వం ఉన్నట్టుండి నిలిపేసింది. దీంతో తిరస్కరణకు గురైనవారు సరైన ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆఫ్లైన్తో పోల్చితే వాన్మిత్రకు దరఖాస్తులు అధికంగా రావటంతోనే ఆ పోర్టల్ను 2020 జూన్ నుంచి నిలిపేశామని బుర్హాన్పూర్ జిల్లా గిరిజన సంక్షేమ విభాగం అసిస్టెంట్ కమిషనర్ లఖన్ అగర్వాల్ తెలిపారు. చాలా జిల్లాల్లో ఈ పోర్టల్ ప్రస్తుతం పనిచేయని మాట నిజమేనని గ్వాలియర్-చంబల్ డివిజన్ గిరిజన సంక్షేమ విభాగం డిఫ్యూటీ కమిషనర్ ఉషా పాఠక్ అంగీకరించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆ రాష్ట్రంలోని గిరిజనులను నిలువునా మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలోని మాండ్లా జిల్లా ఒధారీ గ్రామం వద్ద నర్మదా నదిపై బసానియా ఆనకట్ట కట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ ప్రాంతంలో పూర్తిగా గిరిజనులే నివసిస్తున్నారు. ఈ డ్యామ్ కడితే 6343 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని గుర్తించారు. ఇందులో 2443 హెక్టార్లు వ్యవసాయ భూమి, 2107 హెక్టార్ల అటవీ భూమి, 1793 హెక్టార్ల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రాంతంలో 18 గిరిజన గ్రామాలున్నాయి. డ్యామ్ నిర్మిస్తే ఈ ఊర్లన్నింటినీ ఖాళీ చేయించాల్సి ఉంటుంది. దీంతో మాండ్ల, దిండోరీ జిల్లాల గిరిజనులు డ్యామ్కు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీయటంతో ప్రతిపాదిత డ్యామ్ నిర్మాణాన్ని నిలిపేస్తున్నట్టు 2016 మార్చిలో సీఎం చౌహాన్ సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రకటించారు. దాంతో ఉద్యమం సద్దుమణిగింది. అదే అదనుగా చడీచప్పుడు కాకుండా ఇటీవల ఆ డ్యామ్ నిర్మాణ బాధ్యతలను చౌహాన్ ప్రభుత్వం ముంబై కంపెనీకి అప్పగించింది. వాస్తవంగా డ్యామ్ నిర్మించాలనుకొన్న మాండ్లా జిల్లా రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉన్నది. గిరిజనుల హక్కులను కాపాడేందుకు వారి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను ఈ షెడ్యూల్లో చేరుస్తున్నారు. 5వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ముందుగా అక్కడి గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. కానీ, బీజేపీ ప్రభుత్వం ఈ నిబంధనలేవీ పాటించలేదు. దీంతో తమ హక్కులను కాపాడుకొనేందుకు గిరిజనులు మళ్లీ ఉద్యమ లేవదీసేందుకు సిద్ధమవుతున్నారు.
చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని గుణ జిల్లా కలెక్టర్తోపాటు ముఖ్యమంత్రికి కూడా ఎన్నోసార్లు లేఖలు రాశాం. కానీ, సమస్య ఇప్పటికీ అలాగే ఉన్నది. ఈ జిల్లాలోని ఒక్క బమోరీ తహసీల్లోనే 2,822 వ్యక్తిగత, 4,679 కమ్యూనిటీ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. వాటిని ఎందుకు తిరస్కరించారో కూడా చెప్పవారులేరు.
– సూరజ్ సహరియా, ఏక్తాపరిషద్ నేత
దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను అధికారులు సదరు దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా తెలుపాలని చట్టంలో స్పష్టంగా ఉన్నది. కానీ, ఆ నిబంధన ఎక్కడా అమలుకావటం లేదు. దీంతో గిరిజనులు తమ దరఖాస్తు ఎందుకు తిరస్కరణకు గురైందో తెలియక ఆవేదన చెందుతున్నారు.
– శారదాయాదవ్, నర్మదా ఘాటీ నవనిర్మాణ సమితి నేత