కోల్కతా/ఢాకా/హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తీవ్ర తుఫానుగా బలపడిన ‘రెమాల్’ పశ్చిమబెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రెమాల్ ఆదివారం రాత్రి బంగ్లాదేశాన్ని తీరాన్ని తాకిందని, బెంగాల్ తీరాన్ని దాటే ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.00-1.00 మధ్య తీరాన్ని దాటుతుందని, ఆ తర్వాత రెమాల్ తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు.
పశ్చిమబెంగాల్ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్కతా ఎయిర్పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. కాగా, తుఫాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్లో 8 లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.