న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రోడ్లపైన రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని ఎలాగూ ఆపలేం. అదే వాహనాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసుకొని వాడుకొంటే పర్యావరణానికి కొంతైనా మేలు చేసిన వాళ్లం అవుతాం. టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ ఇదే ఆలోచన చేసింది. వాహనాల వేగం నుంచి పవన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. రోడ్లకు ఇరువైపులా, డివైడర్లపై చిన్న చిన్న టర్బైన్లను ఏర్పాటు చేసింది. వాహనాలు వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆ గాలి వేగానికి టర్బైన్లు తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ టెక్నాలజీ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని అమితంగా ఆకర్షించింది. ‘దీన్ని గనక ఇండియాలో అమలు చేస్తే పవన విద్యుదుత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి టర్బైన్లను ఇండియాలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా..? అని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఈ టెక్నాలజీలో ఒక్కో టర్బైన్ నుంచి గంటకు 1 కిలోవాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. వీటిని ఇస్తాంబుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిని కూడా కొలవడం ఈ టర్బైన్లకు ఉన్న మరో ప్రత్యేకత.