New IT Rules | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మోదీ సర్కార్ తీసుకొస్తున్న కొత్త ఐటీ రూల్స్తో జర్నలిజానికి ముప్పు తప్పదని ప్రముఖ పాత్రికేయుడు, ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్, తప్పుడు, వక్రీకరించే.. పేరుతో వార్తలను ప్రచురించకుండా కేంద్రం అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు విధించటమేనని అభిప్రాయపడ్డారు. కొత్త ఐటీ రూల్స్ ముసాయిదా బిల్లును ఈ ఏడాది జూలైలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ సమాచారమైనా నకిలీ, తప్పుడు, వక్రీకరించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చితే, ఆ వార్తా సమాచారాన్ని మీడియా సంస్థలు ప్రచురించరాదంటూ కొత్త ఐటీ నిబంధనల్ని మోదీ సర్కార్ తీసుకొస్తున్నది. దీనిపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఆన్లైన్ న్యూస్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ‘ఏకపక్షంగా వార్తలను తొలగించేందుకు మార్గం వేస్తున్నారు’ అని చెప్పారు. ఉదాహరణకు లడఖ్లో చైనా తిష్టవేసిందన్న వార్తలను ప్రచురించే అవకాశం ఉండదని అన్నారు. విచారణ అధికారిగా, న్యాయమూర్తిగా కేంద్రం నిలబడటాన్ని ఎవ్వరూ ఆమోదించరని అన్నారు.