న్యూఢిల్లీ, మార్చి 18: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరో వివాదం రేగింది. మాజీ మంత్రి పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో నియమిస్తూ స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించడంతో ప్రభుత్వం మరోసారి సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించడానికి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం అంగీకరించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడటంతో పొన్ముడిపై అనర్హత వేటు పడింది. అయితే ఆయనకు పడిన శిక్షపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయనను స్టాలిన్ ప్రభుత్వం తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోగా, ఆ నియామకాన్ని గవర్నర్ తిరస్కరించారు. అది రాజ్యాంగపరంగా అనైతికతతో కూడుకున్నదని పేర్కొనడంతో ఆయన చర్యను సవాల్ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం తాజాగా సుప్రీంను ఆశ్రయించింది.