న్యూఢిల్లీ, మే 18: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో నాలుగు విడతల్లో పోలైన తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఈసీ చెప్పిన వివరాల ప్రకారం అన్ని నియోజక వర్గాల్లో కలిసి పోలింగ్ రోజున ప్రకటించిన ఓట్ల సంఖ్యకు, తాజాగా వెల్లడించిన తుది ఓట్ల మధ్య 1.07 కోట్ల తేడా ఉంది. మొదటి విడతలో ఈ తేడా 18.6 లక్షలు, రెండో విడతలో 32.2 లక్షలు, మూడో విడతలో 21.1 లక్షలు, నాలుగో విడతలో 33.9 లక్షలతో మొత్తం 1.07 కోట్ల ఓట్లు పెరిగాయి. సగటున ఒక్కో నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు 28 వేలుగా తేలాయి. దీనిపై ఈసీ వివరణ ఇస్తూ ఎన్నికలైన తర్వాత ప్రకటించిన ఓట్లలో పోస్టల్ ఓట్లను చేర్చలేదని తెలిపింది.