ECI team : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, సాధారణ ఎన్నికలతోపాటే జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం ఇవాళ జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్తోంది.
భారత్ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం ఇవాళ జమ్ముకశ్మీర్కు వెళ్లి బుధవారం వరకే అక్కడే పర్యటించనుంది. లోక్సభ ఎన్నికలతోపాటు అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయనుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే దానిపై స్థానిక అధికార యంత్రాంగంతో చర్చించనుంది.
లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా సాధ్యమైతే.. రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్తోపాటే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఒకవేళ భద్రత కల్పించడం సాధ్యం కాదు అంటే.. కేవలం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది.
కాగా, జమ్ముకశ్మీర్లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి లఢఖ్తోపాటు జమ్ముకశ్మీర్లో కూడా కేంద్ర పాలన కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం వచ్చే సెప్టెంబర్లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని కేంద్రం కోరింది. దాంతో ఇవాళ కేంద్ర ఎన్నికల టీమ్ జమ్ముకశ్మీర్కు వెళ్తోంది.