కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం వరుసగా నాలుగోరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,011 కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధానిలో రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు ఆదివారం 4.48 శాతంగా ఉండగా, ఒక్కరోజులోనే ఇప్పుడు 6.42 శాతానికి పెరిగింది.
ఢిల్లీలో యాక్టివ్ కేసులు ఇప్పటివరకూ 4,000 మార్కును దాటాయి. ప్రస్తుతం 4,168 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఇవే అత్యధికం కావడం గమనార్హం. కొవిడ్ నాలుగో వేవ్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధానిలో మళ్లీ కర్ఫ్యూ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివిటీ రేటు 3-5 రోజుల పాటు 5% కంటే ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం కర్ఫ్యూ విధించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.
ఢిల్లీలో కొవిడ్ -19 కేసులు తగ్గే వరకు ఢిల్లీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించాలని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, కొవిడ్తో దవాఖానలో చేరేవారి రేటు తక్కువగా ఉంటే కర్ఫ్యూ అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. దేశరాజధానిలో కొవిడ్-19 కేసులు కొద్ది రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. భారతదేశంలో దవాఖానలో చేరే వారి రేటు పెరగకపోవడం కూడా గమనించదగ్గ విషయం. ఢిల్లీ విషయానికొస్తే, కేవలం 2-3% మంది రోగులు మాత్రమే దవాఖానలో చేరుతున్నారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.
ఆంక్షల ద్వారా కాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కొవిడ్ నాలుగో వేవ్ను తట్టుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వ్యక్తులపై రూ.500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ వాహనాల్లో కలిసి ప్రయాణించేవారికి జరిమానా వర్తించదని పేర్కొంది.