రాజ్కోట్, మే 26: గుజరాత్లోని రాజ్కోట్లో గల టీఆర్పీ గేమ్జోన్లో శనివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. మృతుల శరీరాలు గుర్తుపట్టలేకుండా మారిపోయాయి. దీంతో కుటుంబసభ్యులకు అప్పగించేందుకు గానూ మృతదేహాల డీఎన్ఏ నమూనాలు తీసుకొని పరీక్షిస్తున్నారు. ప్లేజోన్లో వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ఈ ఘటన పట్ల గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘మనిషి చేసిన విపత్తు’ అని కోర్టు పేర్కొన్నది. సుమోటోగా తీసుకొని విచారణ ప్రారంభించింది. మరోవైపు ఈ ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.
రాజ్కోట్ అగ్నిప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధ గాథ. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మంటల్లో చిక్కుకొన్న తన కుమారుడు, మరో ముగ్గురు కుటుంసభ్యులను కాపాడేందుకు వెళ్లిన వీరేంద్ర సిన్హ్ జడేజా(42) కూడా బయటకు రాలేకపోయాడని అతని కుమార్తె దేవికాబా పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు 10-15 మధ్య ఏండ్ల వయసు వారని తెలిపారు. మరోవైపు బాధితుల్లో కొత్తగా పెండ్లి అయిన జంట వివేక్(26), కుషాలి దుసరా(24) ఉన్నారు.