న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్ గాళ్లంతా బీజేపీలో చేరారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ, సీబీఐ (ED, CBI)లు దేశంలోని అవినీతి పరులందరినీ ఒకే పార్టీలో కలుపుతున్నాయని విమర్శించారు. అవినీతిపరుల తలలకు తుపాకులు గురిపెట్టి ‘జైలుకు వెళ్తావా, బీజేపీలోకి వెళ్తావా..?’ అని ఈడీ, సీబీఐ బెదిరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
సిసోడియా తలకూ తుపాకీ గురి..
అవినీతిపరులు కేసులకు భయపడి బీజేపీలో చేరుతున్నారని, కానీ తప్పు చేయని విపక్ష నేతలు మాత్రం బీజేపీకి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా జైలుకు వెళ్తున్నారని కేజ్రివాల్ చెప్పారు. అసోంలో హిమాంత బిశ్వశర్మ, కోల్కతాలో సువేంధు అధికారి, మహారాష్ట్రలో నారాయణ్ రాణే తదితరులు ఈడీ, సీబీఐ ఎక్కుపెట్టిన తుపాకులకు భయపడి బీజేపీలో చేరిన అవినీతిపరులని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) తలకు కూడా ఈడీ, సీబీఐ తుపాకీ గురిపెట్టి ‘బీజేపీలో చేరతావా.. జైలుకు వెళ్తావా..?’ అని బెదిరించాయని, కానీ సిసోడియా చావనైనా చస్తా గానీ బీజేపీలో చేరనని తెగేసి చెప్పారని, అందుకే ఆయనను జైలుకు పంపించారని కేజ్రివాల్ ఫైరయ్యారు.
బీజేపీ అధికారం కోల్పోతే దేశం అవినీతి రహితం..
దేశ ప్రధాని పీఠంపై నుంచి నరేంద్రమోదీ ఎప్పుడైతే దిగిపోతాడో అప్పుడే దేశం అవినీతి రహితమవుతుందని (Corruption-free India) కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారం కోల్పోగానే దేశ ప్రజలు బీజేపీ నేతలను కటకటాల వెనుకకు పంపిస్తారని, దాంతో దేశం అవినీతి రహితం అవుతుందని తెలిపారు. ఇక అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం బయట మీడియాతో కేజ్రివాల్ మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు.
ఆప్ను చీల్చేందుకు బీజేపీ కుట్ర..
అసెంబ్లీలో తనపై అవిశ్వాస తీర్మానం (No-confidence motion) ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ప్రకటించిందని, కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో 20 శాతం మంది సంతకాలు అవసరమని కేజ్రివాల్ చెప్పారు. బీజేపీకి సభలో అంత బలం లేకపోయినా కేవలం తమ పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే కలిసి వస్తారనే దురుద్దేశంతోనే ఆ ప్రకటన చేసిందని మండిపడ్డారు. అయినా తాను విశ్వాస తీర్మానం (Confidence motion) పెట్టి సభలో బలం నిరూపించుకున్నానని, తీర్మానం భారీ మెజారిటీతో నెగ్గిందని కేజ్రివాల్ తెలిపారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, “ED & CBI have brought all the corrupt people of the country in one party. ED-CBI raid & put a gun to their head and ask them if they want to go to jail or to BJP…The day PM Modi does not remain the PM, India will become a… pic.twitter.com/ZrBfhTTpJE
— ANI (@ANI) March 29, 2023