మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు గానూ ఢిల్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన రోజునే భర్తని అరెస్ట్ చేయగా, సోమవారం రోజున భార్యని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు.. తమ కారులో రోడ్డుపైకి వచ్చారు. దరియాగంజ్ ఏరియాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ దంపతులిద్దరూ మాస్కులు ధరించకపోవడంతో వారిని ఆపి ప్రశ్నించారు. కారులో ప్రయాణించినప్పటికీ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. కారులో ఒక్కరు వెళ్లినా మాస్కు ధరించాలని కోర్టు ఆదేశించిందని వారికి పోలీసులు చెప్పారు. అవేమీ వినిపించుకోకుండా ఆ దంపతులిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా భర్తను నేను ముద్దుపెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా..? అంటూ సదరు మహిళ పోలీసులను ప్రశ్నించింది. నా భార్యతో కారులో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపారు? అని అతను ప్రశ్నించాడు.