Vice President | దేశ ఆర్బిట్రేషన్ వ్యవస్థ రిటైర్డ్ న్యాయమూర్తుల చేతుల్లో ఉందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ఇతరులకు అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఇప్పుడు మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, అవసరమైన మార్పులు చేయాలన్నారు. అవసరమైతే చట్టాలను సైతం మార్పు చేయాలన్నారు. దేశంలో ఉన్నంతగా రిటైర్డ్ జడ్జిలకు ఆర్బిట్రేషన్ వ్యవస్థపై ఇంత బలమైన పట్టు ఏ దేశంలోనూ, మరే ఇతర వ్యవస్థలోనూ లేదని లేదన్నారు. కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ను ఉప రాష్ట్రపతి ప్రశంసించారు.
ఒక వ్యక్తి ఈ దేశ న్యాయవ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్నారని, ఆయనే దేశ ప్రధాన న్యాయమూర్తి అంటూ కితాబిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఆర్బిట్రేషన్ వ్యవస్థలో వైవిధ్యం కొరవడిందని.. రిటైర్డ్ న్యాయమూర్తులు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నారు. దీనిపై వైస్ ప్రెసిడెంట్ స్పందిస్తూ.. ఆయనకు (సీజేఐకి) సెల్యూట్ చేస్తున్నానని.. ఇతర అర్హులైన వారిని విస్మరిస్తున్నారన్నారు. సీజేఐ చేసిన ఈ ప్రకటన తనకు చిరకాలం గుర్తుండిపోతుందని, మధ్యవర్తిత్వ ప్రక్రియకు బలం చేకూరుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారత్లో తగినంత సంఖ్యలో అర్హత ఉన్న వ్యక్తులు ఉన్నారని.. కానీ వారు ఆర్బిట్రేషన్ వ్యవస్థలోకి ఎంపికవడం లేదన్నారు.