పట్నా: బీహార్లో జేడీయూ ప్రభుత్వ పతనం మొదలైందని లోక్జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. నా మాటలను గుర్తుపెట్టుకోండి. జేడీయూ ప్రభుత్వ పతనం మొదలైంది అని ఆయన వ్యాఖ్యానించారు. జేడీయూ నాయకులంతా కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరుగవద్దని ప్రార్థించాలని, లేదంటే జేడీయూకు గట్టిగా తొలిదెబ్బ తగులబోతోందని ఆయన హెచ్చరిక చేశారు. అదేవిధంగా ఎల్జీపీలో తిరుగుబాటు లేవదీసి చీలిక తెచ్చిన తన చిన్నాన్న పశుపతి పరాస్కు మంత్రిపదవి ఇవ్వనున్నారన్న వార్తలపై కూడా చిరాగ్ స్పందించారు.
పశుపతి పరాస్కు ఎల్జేపీ కోటాలో కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడం సాధ్యం కాదని చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎల్జేపీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిందని చిరాగ్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు. ఒకవేళ పశుపతి పరాస్కు మంత్రి పదవి ఇస్తే తాను కోర్టుకు వెళ్తానన్నారు. స్వతంత్ర ఎంపీగా, లేదంటే జేడీయూ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.