న్యూఢిల్లీ : వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు మరో మలుపు తిరిగింది. ఈ మసీదును హిందూ ఆలయంపై నిర్మించారో లేదో తేల్చాలని జిల్లా కోర్టు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. మసీదు నిర్వహణ కమిటి అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఏఎస్ఐ పరిశోధనను ఆపేందుకు సరైన కారణం ఏదీ కనిపించటం లేదని పేర్కొన్నది. దీంతో అంజుమన్ సంస్థ వెంటనే సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే నిలుపుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరింది.
ఏమిటీ వివాదం?
వారణాసిలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉన్నది. అయితే, ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని, 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పాక్షికంగా పడగొట్టి, దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మసీదులో సర్వే నిర్వహించి సవివరమైన నివేదిక ఇవ్వాలని వారణాసి జిల్లా కోర్టు జూలై 21న ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో మసీద్ కమిటీ పిటిషన్ వేయగా, తీర్పును ఆగస్టు 3న వెలువరిస్తామని పేర్కొన్నది.