న్యూఢిల్లీ, జూన్ 13: రుతుపవనాల ప్రవాహం నుంచి బిపర్జాయ్ తుఫాను వేరుపడిందని, రుతుపవనాలపై ఇక తుఫాను ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం తెలిపింది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం వర్షపాతంపై ఉండబోదని స్పష్టం చేసింది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల దక్షిణాది రాష్ర్టాల్లోనూ ఆలస్యమైందన్నారు. ఈసారి వాయవ్య భారత్లో సాధారణ నుంచి సాధారణకు దిగువ వర్షపాతం నమోదవుతుందని, తూర్పు, ఈశాన్య, మధ్య, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణ వర్షపాతం ఉంటుందని పేర్కొన్నారు.
బిపర్జాయ్ తుఫాను గుజరాత్లోని జఖౌ పోర్టు సమీపంలో బుధవారం తీరాన్ని తాకనున్నది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో గుజరాత్లోని తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.