న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. విమానాలకు ఇంధనంగా ఉపయోగించే ఏటీఎఫ్ ధరను కిలోలీటర్కు రూ.5,779(5.1 శాతం) పెంచింది.
ఏటీఆర్ ధరలను పెంచడం జూలై నుంచి వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరలపెంపు వలన హోటళ్లు, రెస్టారెంట్లపై భారం పడనున్నది. ఈ ప్రభావం ధరల రూపంలో వినియోగదారులపై చూపే అవకాశం ఉన్నది. ఏటీఎఫ్ గత నాలుగు నెలల్లో మొత్తంగా దాదాపు రూ.29,391 మేర పెరిగింది. దీని వలన విమాన సంస్థల నిర్వహణ ఖర్చు కూడా దాదాపు 40 శాతం మేర పెరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.