DPDP | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: యూజర్ల వ్యక్తిగత డాటా తొలగింపు, ఆన్లైన్ సేవలకు సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది. యూజర్ల ఖాతాలు మూడేండ్లపాటు క్రియారహితంగా (ఇనాక్టివ్) ఉంటే, యూజర్ల వ్యక్తిగత డాటాను ఆన్లైన్ వేదికలు శాశ్వతంగా తొలగించే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసింది. 18 ఏండ్లలోపు వారి విషయంలోనూ తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాకే, వారికి ఆన్లైన్ సేవలను వర్తింపజేయాలన్న నిబంధనను తీసుకువస్తున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్లో ఈ ముసాయిదా నిబంధనలను చేర్చింది. వీటిని ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది.
డీపీడీపీ చట్టానికి ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ పలు క్లాజులకు అదనపు నిబంధనలు జోడించారు. సంప్రదింపుల కోసం వీటిని త్వరలోనే విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో నోటిఫై చేయనున్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఆన్లైన్ గేమింగ్ తదితర సంస్థలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. మరోవైపు, ఆన్లైన్ సేవలు పొందే ముందు పిల్లల వయసు ధ్రువీకరించుకోవడం తప్పనిసరి చేయనున్నది. 18 ఏండ్లలోపు వారికి.. వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. వయసు ఆధారంగా ఆన్లైన్ సేవలకు అనుమతి ఇవ్వటమనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.