న్యూఢిల్లీ: ఉద్యోగాల పేరుతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతానికి భారత యువతను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరపున బలవంతంగా పాల్గొన్న హైదరాబాద్ యువకుడు సహా పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించింది. వీసా కన్సల్టెన్సీ సంస్థలు, ఏజెంట్లపై కేసులు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీ, తిరువనంతపురం, ముంబై, అంబాలా, చండీగఢ్, మధురై, చెన్నైలలో అనేక చోట్ల సోదాలు నిర్వహించింది.
ఈ సంస్థలు, వాటి ఏజెంట్లు దాదాపు 35 మంది యువకులను అధిక జీతం, ఆకర్షణీయమైన ఉద్యోగాలను ఆశ పెట్టి, రష్యాకు తరలించినట్లు సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాలు, స్థానిక ఏజెంట్ల ద్వారా వీరు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మన దేశం నుంచి అక్రమంగా తరలించిన యువకులకు, వారు ఇష్టపడకపోయినప్పటికీ, యుద్ధ శిక్షణ ఇచ్చి, యుద్ధంలోకి పంపిస్తున్నారని, వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు.