‘దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా. మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తేస్తాం’- 2021 నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏడాది గడిచింది. నల్లచట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏడాదిన్నరపాటు నిరసనోద్యమం సాగించిన అన్నదాతలపై నమోదైన 12 ఎఫ్ఐఆర్లను హర్యానాలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు ఇంకా ఎత్తేయలేదు. ఈ మేరకు రైతు నేత రాకేశ్ బాయిన్స్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ఆర్పీఎఫ్ పోలీసులు సమాధానమిచ్చారు.
కేసులు ఎత్తివేయాలంటూ తమకు ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఏడాది గడిచినా కేసుల ఎత్తివేత ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై రైతు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లే ఇచ్చి తమను మోసం చేశారని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 24న అంబాలాలో నిరసనలు చేపట్టి రైల్ రోకో నిర్వహిస్తామన్నారు.
రైతులపై కేంద్రం వేధింపుల పర్వం
సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం సందర్భంగా రైతులపై నమోదైన డజను కేసులు ఇంకా ఎత్తివేయలేదు. అంతకుముందు వివిధ సందర్భాల్లో అన్నదాతలపై 30కి పైగా కేసులు నమోదు చేశారు. అవీ అలాగే ఉన్నాయి. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న రైతులను వేధించబోమని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, పాస్పోర్ట్, ఆత్మరక్షణ కోసం వినియోగించే రివాల్వర్ల లైసెన్సుల జారీ విషయంలో ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నది.
-రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చడూనీ